2024 సంవత్సరంలో లో దేశవ్యాప్తంగా రూ.22,845.73 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం ఇది దాదాపు 206 శాతం పెరిగింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 2024లో సైబర్ మోసాల కారణంగా ప్రజలు రూ.22,845.73 కోట్లు నష్టపోయారు. 2023లో ఈ నష్టం రూ.7,465.18 కోట్లుగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం లోక్సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి 2022లో 10,29,026 కేసులు, 2023లో 15,96,493, 2024లో 22,68,346 కేసులు నమోదయ్యాయని కేంద్రమంత్రి తెలిపారు. ఆర్థిక మోసాలను వెంటనే నివేదించడానికి, సైబర్ నేరాలను అరికట్టడానికి 2021లో సెక్షన్ ఐ4సీ కింద సీఎఫ్సీఎఫ్ఆర్ఎమ్సీని ప్రారంభించినట్లు బండి సంజయ్ తెలిపారు. ఇప్పటివరకు 17.82 లక్షలకు పైగా ఫిర్యాదులు అందగా.. రూ.5,489 కోట్లకు పైగా మొత్తాన్ని రికవర్ చేసినట్టు తెలిపారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదైన కేసులను ఎఫ్ఐఆర్గా నమోదు చేసి, ఛార్జిషీట్లు వేయడం, అరెస్టులు, అనంతర చర్యలు తీసుకోవడం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖల పరిధిలోకి వస్తాయని మంత్రి స్పష్టంచేశారు. ఇప్పటివరకు 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2,63,348 ఐఎమ్ఈఐలను కేంద్రం బ్లాక్ చేసిందని చెప్పారు. సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో గతేడాది సెప్టెంబరు 10న సస్పెక్ట్ రిజిస్ట్రీని ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 11 లక్షల సస్పెక్ట్ డేటా, 24 లక్షల మ్యూల్ అకౌంట్ల వివరాలను సేకరించినట్లు చెప్పారు. వీటితో పాటు రూ.4,631 కోట్ల వరకు నష్టాన్ని నివారించినట్లు ఆయన వెల్లడించారు. నేరస్థుల లొకేషన్ గుర్తించేందుకు తీసుకొచ్చిన 'ప్రతిబింబ్' ద్వారా 10,599 మంది నిందితులను అరెస్టు చేసినట్లు మంత్రి చెప్పారు.
2024లో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్ము రూ.22,845 కోట్లు !
July 22, 2025
0
Tags