అఖండ గోదావరి ప్రాజెక్టుకు రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు. పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుష్కరాల నాటికి ఇది పూర్తి కానుంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) కింద రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు, 127 ఏళ్ల చరిత్ర ఉన్న హేవలాక్ వంతెన రూపురేఖలు మార్చడంతో పాటు గోదావరి మధ్యలో 116.97 ఎకరాల్లో బ్రిడ్జిలంక (హేవలాక్ వంతెన, రోడ్కం రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతం)ను వినోద కేంద్రంగా మార్చనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు తర్వాత ఏడాదికి సగటున 18 లక్షల నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని యంత్రాంగం అంచనా వేస్తోంది. స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన
June 26, 2025
0
Tags