బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం ఆయనను వరంగల్కు తరలించారు. కమలాపురం మండలం వంగపల్లి గ్రామంలో గ్రానైట్ వ్యాపారి క్వారీ యజమాని మనోజ్రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి గతంలో తన భర్త నుండి రూ.25 లక్షలు వసూలు చేశారని, ఏప్రిల్ 18న ఫోన్ చేసి మరో రూ.50 లక్షలు డిమాండ్ చేశారని ఉమాదేవి ఆరోపించారు. ఉమా దేవి ఫిర్యాదు ఆధారంగా హనుమకొండ సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద అభియోగాలు మోపారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కౌశిక్ రెడ్డి పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ సందర్భంగా మనోజ్ రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరించారని ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పించింది. అయితే కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది మాత్రం... ప్రజల ఫిర్యాదు గురించి తెలియజేయడానికి మాత్రమే మనోజ్ రెడ్డికి తన క్లైయింట్ ఫోన్ చేశారని చెప్పారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసనం సోమవారం రోజున ఎమ్మెల్ కౌశిక్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించింది. పోలీసులు అతన్ని అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును కూడా రద్దు చేసింది. అయితే ఆ వెంటనే కౌశిక్ రెడ్డి ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై కూడా న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అదే సమయంలో కౌశిక్ రెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
June 21, 2025
0
Tags