ఏపీలో కలిపిన నాలుగు పంచాయతీలను అత్యవసరంగా తెలంగాణలో కలపాలి

Telugu Lo Computer
0


తెలంగాణలోని భద్రాచలం చుట్టూ ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని, అధిక కర్క్యుమిన్‌ శాతం, ఎగుమతులకు అనుకూలమైన విత్తన రకాల అభివృద్ధి కోసం జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఆదివారం నిజామాబాద్‌లోని బస్వా గార్డెన్‌లో పసుపు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్‌షాను తుమ్మల కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. ''ఏపీ పునర్విభజన చట్టం-2014 కింద నాలుగు పంచాయతీలు, వాటి పరిధిలోని 17 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. దీనివల్ల పరిపాలనపరమైన సమస్యలే కాకుండా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భద్రాచలం పట్టణానికి, తెలంగాణలోని ప్రధాన మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రెండు రాష్ట్రాల చెక్‌పోస్టుల వల్ల గిరిజనులకు, వాణిజ్య వాహనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వామపక్ష తీవ్రవాద ప్రాంతం కావడం వల్ల శాంతిభద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయి. భద్రాచలంలోని విద్యాసంస్థల్లో చదివే గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దేవస్థానం భూములు ఏపీలో కలవడంతో ఆలయ నిర్వహణకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నాలుగు పంచాయతీలను అత్యవసరంగా తెలంగాణలో కలపాలి. పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలి. కేంద్ర సంస్థల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలి. డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంలు నిర్మించాలి. సాగు యాంత్రీకరణ, విలువ ఆధారిత గొలుసు అభివృద్ధిపై పరిశోధనలకు, భౌగోళిక సూచిక(జీఐ) ఆధారంగా తెలంగాణ పసుపును అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రాండ్‌ చేయడానికి కేంద్రం సహకారం అందించాలి. విలువ ఆధారిత, సేంద్రియ సాగు, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలి. కూలీల కొరత నివారణకు యంత్రాలను అందుబాటులోకి తేవాలి. పంట అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి'' అని తుమ్మల కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)