అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కేవలం కొన్ని నిమిషాలకే కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మరణించారని సమాచారం. ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వారు, ఒకరు కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు. గాయపడిన వ్యక్తులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రయాణీకుల సమాచారం కోసం 1800 5691 444 అనే ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు. ఈ విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఈ ఎయిర్ ఇండియా విమానం మేడే కాల్ జారీ చేసిందంటూ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్. తాము అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి తెలియజేయడం కోసం ఈ పదాన్ని వాడుతారు. అంటే.. తాము ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేయడం. ఎమర్జెన్సీ సమయాల్లో మేడే అనే పదాన్ని పైలట్లు మూడు సార్లు అంటారని చెబుతారు. అసలు ఈ మేడే పదం మైడెర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చిందని అంటున్నారు. అంటే సాయం చేయండి అని దీని అర్థమట. విమానాల్లో, నౌకల్లో ఈ మేడే కాల్ను వాడతారు.
అహ్మదాబాద్ లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం
June 12, 2025
0
Tags