అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో పరిస్థితులు చేదాటిపోయాయి. కొద్ది రోజులుగా లాస్ ఏంజిల్స్ రణరంగంగా మారింది. అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అడ్డుకున్న భద్రతా దళాలపై కూడా దాడులకు తెగబడ్డారు. కార్లు, ఆస్తులు ధ్వంసం చేశారు. దీంతో ట్రంప్ సర్కార్ నేషనల్ గార్డ్స్, మెరైన్ గార్డ్స్ను రంగంలోకి దింపింది. అయినా కూడా ఘర్షణలు చల్లారలేదు. తాజాగా నిరసనకారులు లూటీలకు తెగబడ్డారు. ఒక ఆపిల్ స్టోర్స్, జ్యువెల్లరీ స్టోర్స్ లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడ్డారు. అంతేకాకుండా నిత్యావసర స్టోర్లు కూడా దోచుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వైపు మాస్కులు ధరించి నిరసనల్లో పాల్గొన కూడదని ఆదేశాలు ఉన్నా కూడా లెక్కచేయకుండా మాస్కులు ధరించి మరీ లూటీలకు పాల్పడ్డారు. ఇక పరిస్థితులు చేదాటిపోవడంతో తాజాగా లాస్ ఏంజిల్లో కర్ఫ్యూ విధించారు. నిరసన ముసుగులో కొందరు దుండగులు చెలరేగిపోయినట్లు తెలుస్తోంది. డౌన్టౌన్లో నిరసనల సమయంలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు ఆపిల్ స్టోర్లోకి ప్రవేశించారు. స్టోర్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి గ్యాడ్జెట్లను దోచేశారు. మరికొన్ని దుకాణాల్లోకి కూడా చొరబడి విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేశారు. ఇక పరిస్థితులు చేదాటిపోవడంతో డౌన్టౌన్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు లాస్ ఏంజిల్ మేయర్ కరెన్ బాస్ ప్రకటించారు. లూటీ చేసినవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మేయర్ హెచ్చరించారు. అక్రమ వలసదారులను అరెస్టు చేసేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం లాస్ ఏంజిల్లో సోదాలు ప్రారంభించడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసనలు కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో, శాంతా అనా, టెక్సాస్లోని డాలస్, ఆస్టిన్లకు కూడా విస్తరించాయి. ఆపిల్ స్టోర్ లూటీ ఘటనలో ఒక మహిళను అరెస్ట్ చేసినట్లు లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి క్రిస్ మిల్లర్ వెల్లడించారు. మరో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం అరెస్ట్ల పర్వం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నిరసనల్లో పాల్గొన్న 50 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిరసనకారులను చాలా పెద్ద శక్తితో ఎదుర్కొంటామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్లో వారాంతపు సైనిక కవాతులో నిరసనలు తెలియజేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలను హెచ్చరించారు. నిరసన తెలపాలనుకునే వారికి చాలా పెద్ద శక్తితో ఎదుర్కోబోతున్నట్లు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు
లాస్ ఏంజిల్లో కర్ఫ్యూ : ఆపిల్ స్టోర్స్, జ్యువెల్లరీ స్టోర్స్ దోపిడీ
June 11, 2025
0
Tags