గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన నర్సు రంజిత జి.నాయర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేసినట్లు కేరళ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆ అధికారి పోస్టులు నీచమైనవి, ద్వేషపూరితమైనవి, క్రూరమైనవి అని రెవెన్యూ మంత్రి కె. రాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెవెన్యూ మంత్రి ఆదేశాల మేరకు కాసర్గోడ్కి చెందిన జూనియర్ సూపరింటెండెంట్ ఎ.పవిత్రన్ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.ఇన్బసేకర్ పేర్కొన్నారు. విచారణ పెండింగ్లో ఉందని అన్నారు. ప్రాథమిక విచారణలో పవిత్రన్ రంజన్ను కుల వివక్షతో దూషించారని, దురుసుగా మాట్లాడారని తేలిందని అన్నారు. బిఎన్ఎస్ మరియు ఐటి చట్టంలోని నిబంధనల ప్రకారం సోషల్మీడియా దుర్వినియోగం ఆరోపణలపై పోలీసులు ఆ అధికారిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వివరాల ప్రకారం తన ఇద్దరు కుమార్తెలు, అనారోగ్యంతో ఉన్న తల్లితో కొన్ని రోజుల పాటు గడిపిన రంజిత నాయర్ లండన్కు పయనమైంది. ఆమె గత కొన్నేళ్లుగా లండన్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రంజిత కూడా మరణించారు. ప్రమాదం అనంతరం బాధిత కుటుంబాన్ని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ కలిశారు. సోషల్ మీడివయా పోస్టుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వివాదాస్పద పోస్టును సోషల్మీడియా నుండి తొలగించారు.
విమాన ప్రమాదంలో మరణించిన నర్సుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేరళ రెవెన్యూ అధికారి సస్పెండ్
June 13, 2025
0
Tags