ఆంధ్రప్రదేశ్ ఘటనలపై సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మహిళా కమిషన్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న రెండు సంచలన ఘటనలపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తుకు ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు వ్యవహారాలపై తీసుకున్న చర్యలను తమకు తెలియజేయాలంటూ కూడా ఆదేశాల్లో పేర్కొంది. ఈ విషయాన్ని తమ ఎక్స్ హ్యాండిల్ లోనూ పోస్ట్ చేసింది. సాక్షి టీవీలో చర్చ సందర్భంగా అమరావతి మహిళలపై జర్నలిస్ట్ వి.వి.ఆర్.కృష్ణంరాజు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా విచారణకు స్వీకరించినట్లు జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. అమరావతిని "వేశ్యల రాజధాని"గా పేర్కొనడం మహిళా రైతులకు దారుణమైన అవమానమని తెలిపింది. ప్రజా చర్చలో ఇటువంటి ఆమోదయోగ్యం కాని, రెచ్చగొట్టే ప్రకటనలను ఎన్‌సిడబ్ల్యు తీవ్రంగా ఖండిస్తుందని, త్వరితగతిన దర్యాప్తు చేయాలని, సంబంధిత చట్టాల ప్రకారం రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఆదేశించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకుని మూడు రోజుల్లో తమకు నివేదించాలని ఆదేశించారు. అలాగే అనంతపురం విద్యార్థిని తన్మయి దారుణ హత్య నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని జాతీయ మహిళా కమిషన్ మరో ట్వీట్ లో తెలిపింది. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అనే శీర్షికతో వచ్చిన మీడియా నివేదికను జాతీయ మహిళా కమిషన్ స్వయంగా స్వీకరించిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నివాసి అయిన 20 ఏళ్ల సాకే తన్మయి దారుణంగా హత్య చేయబడి, ఆమె మృతదేహాన్ని తగలబెట్టారని ఆ నివేదిక పేర్కొందని తెలిపింది. నేరం యొక్క భయంకరమైన స్వభావం, బాధితురాలి కుటుంబం, సమాజానికి కలిగించిన గాయం పట్ల కమిషన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందిందనట్లు వెల్లడించింది. ఇటువంటి హింసాత్మక చర్యలు మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడం, మహిళల భద్రత , గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని తెలిపింది. కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఈ సంఘటనపై దర్యాప్తు స్థితి, అరెస్టులు , ప్రస్తుత అప్ డేట్స్ తో సహా వివరణాత్మక నివేదికను కోరుతూ డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపింది. నిందితులపై త్వరితంగా, కఠినంగా వ్యవహరించడానికి, ఈ ప్రాంతంలో మహిళల భద్రతను కాపాడేందుకు నివారణ చర్యలను అమలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ ఘటనపైనా మూడు రోజుల్లోగా నివేదికను సమర్పించాలని కమిషన్ కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)