తెలంగాణ వైద్యారోగ్యశాఖలోని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, హానరోరియం, మల్టీటాస్కింగ్ విధానంలో పనిచేస్తోన్న 16వేల మంది పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంఈ పరిధిలో రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో 4,772 మంది, ఔట్ సోర్సింగ్ విధానంలో 8,615 మంది, హానరోరియమ్ పోస్టుల్లో 3,056 మంది, ఎంటీఎస్ విధానంలో ఐదుగురు పనిచేస్తున్నారు. మొత్తం 16,448 మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులు, నర్సింగ్, డెంటల్ కాలేజీల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో టీచింగ్ ఫ్యాకల్టీ సహా.. నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, డీఈఓలు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉండటం గమనార్హం. డీఎంఈ విభాగంలో సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ఆదేశాలు 2026 మార్చి 31వరకు కొనసాగనున్నాయి. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి థర్డ్ పార్టీ నుంచి, మిగతా విభాగాల వారికి ప్రభుత్వం నుంచి నేరుగా వేతనాలు అందించనున్నారు.
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 16 వేల మంది సిబ్బంది పదవీ కాలం పొడిగింపు
June 29, 2025
0
Tags