విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వైఎస్ షర్మిల అల్టిమేటం !

Telugu Lo Computer
0


కార్మికులకు జీతాలు చెల్లించకుండా వేధిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీరుపై పీసీసీ ఛీఫ్ వైఎస్ తీవ్ర విమర్శలు చేశారు. ఎల్లుండి లోగా సమస్య పరిష్కారం కాకపోతే ప్లాంట్ ముందు ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు. విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి అని ఎక్స్ లో వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. డిమాండ్ల సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మె బాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న కనికరం కూడా లేదన్నారు. దిక్కున్న చోట చెప్పుకోండనే తీరున యాజమాన్యం వ్యవహరిస్తోందని షర్మిల ఆరోపించారు. ఇప్పటికే 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పొట్టగొట్టిన యాజమాన్యం.. మరో 3 వేల మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వైఎస్ షర్మిల అల్టిమేటం ఇచ్చారు. రేపటిలోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలని షర్మిల సూచించారు.2021 జనవరిలో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేయాలన్నారు. లేకుంటే రేపటి నుంచి కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ బయటే "ఆమరణ దీక్ష" కు దిగుతామని వైఎస్ షర్మిల హెచ్చరించారు. ఆంధ్రుల హక్కు - విశాఖ ఉక్కు అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)