కర్ణాటకలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆడ బిడ్డపై ఓ గుంపు సామూహిక అత్యాచారానికి పాల్పడింది. కొన్ని నెలల జైలు అనంతరం నిందితులు బెయిల్ విడుదలయ్యారు. నిందితులు ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లుగా పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. బైకులు, కార్లతో సంబరాలు చేసుకుంటూ భారీ ఊరేగింపుతో రోడ్లపై తిరిగారు. నిందితులంతా చిరునవ్వులు నవ్వుతూ చేతులు ఊపుతూ సంతోషంగా సాగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో పోలీసులు కూడా కనిపిస్తున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై మహిళా సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. అత్యాచార నిందితుల ర్యాలీని అడ్డుకోకపోవడమేంటి? అని నిలదీస్తున్నారు. మైనార్టీ వర్గానికి చెందిన బాధితురాలు 40 ఏళ్ల కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్తో సంబంధం పెట్టుకుంది. జనవరి 8, 2024న హనగల్లోని ఒక ప్రైవేటు హాటల్లో గది బుక్ చేసుకుని ఏకాంతంగా వున్నారు. ఇంతలో కొంత మంది పురుషుల బృందం హోటల్ గదిలోకి ప్రవేశించి ఆమెను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యంత ఘోరంగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు అనుమానితులను గుర్తించి సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి 19 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు ప్రధాన నిందితులుగా ఉన్నారు. మిగతా వారంతా ఆమెను వేధించడం, భౌతికదాడికి పాల్పడ్డారు. తొలుత పోలీసులు స్ట్రాంగ్గా కేసు నమోదు చేయకపోవడంతో జనవరి 11న బాధితురాలు మేజిస్ట్రేట్కు అధికారిక వాంగ్మూలం ఇచ్చింది. అనంతరం పోలీసులు సీరియస్గా నమోదు చేశారు. నిందితుల్లో పన్నెండు మంది దాదాపు 18 నెలల క్రితం బెయిల్పై విడుదలయ్యారు. ప్రధాన నిందితులైన ఏడుగురికి ఇటీవల బెయిల్ వచ్చింది. వారికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం హవేరిలోని అక్కి ఆలూర్ పట్టణంలో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. భారీ కాన్వాయ్తో పాటు బైకర్లు పాల్గొన్నారు. సంగీతం పాటు పెద్ద ఎత్తున కేకలు వేసుకుంటూ వచ్చారు. నిందితులు చిరునవ్వులు నవ్వుతూ ఉంటే బైకర్లు సంబరాలు చేసుకుంటూ వచ్చారు. వీరిని పోలీసులు ఆపే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మహిళా సంఘాలు ముక్కున వేలు వేసుకుంటున్నాయి. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? అని వాపోతున్నారు. ఏడుగురు ప్రధాన నిందితులైన అఫ్తాబ్ చందనకట్టి, మదర్ సాబ్ మందక్కి, సమివుల్లా లలనావర్, మొహమ్మద్ సాదిక్ అగసిమణి, షోయిబ్ ముల్లా, తౌసిప్ చోటి, రియాజ్ సావికేరిలకు ఇటీవల హవేరి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్యాంగ్రేప్ నిందితులకు బెయిల్ : భారీ ఊరేగింపుతో సంబరాలు
May 23, 2025
0
Tags