మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లికి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ పాక్ వార్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ తో పాటు మరో ఇద్దరు వీరమరణం పొందారు. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్ జమ్ము కశ్మీరులోని ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. జవాన్ మురళి నాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు ఈ మదర్స్ డే ని షర్మిల అంకితం చేశారు. షర్మిల మాట్లాడుతూ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ - మాతృభూమి రక్షణ కోసం అసువులు బాసిన.. జవాన్ మురళి నాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మన దేశ రక్షణ కోసం.. కన్నప్రేమను పణంగా పెట్టిన వీరమాతలకు.. ఈ మదర్స్ డే అంకితమన్నారు. ఈ దేశ ముద్దుబిడ్డలు మన సైనికులు.. ఇలాంటి రక్షకులకు జన్మనిచ్చిన ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.. యుద్ధభూమిలో బిడ్డను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుతూ.. దేశం కోసం ప్రాణత్యాగం చేశాడనే గర్వాన్ని చూపే.. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మనిషి జన్మకు, గమనానికి మూలం అమ్మ.. ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు సమానమైనది మరొకటి లేదు.. అమ్మ ప్రేమ, దీవెనలే మనకు కొండంత అండ అని తెలిపారు.
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం
అంతర్జాతీయ మాతృ దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం జరుపుకుంటారు. 'మదర్ ఆఫ్ గాడ్స్'గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదట గ్రీస్ దేశంలో నిర్వహించారు.