ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్లీ మట్టేనా ? అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్లీ మట్టేనా ? అంటూ ఎద్దేవా చేశారు. పదేళ్ల  క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారని.. మన ఆశల మీద నీళ్లు చల్లి వెళ్లారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. "ప్రధాని నరేంద్ర మోడీ  గారు @narendramodi.. ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్లీ మట్టేనా ? పదేళ్ల  క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారు. మన ఆశల మీద నీళ్లు చల్లి వెళ్లారు. ఇప్పుడు రాజధాని పునః శంకుస్థాపనకు వస్తున్న మోదీ గారికి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నాం. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలి.10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆత్మ విమర్శ చేసుకోవాలి" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. "మోడీ గారు ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగు పెట్టాలి. మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలి. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత. ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలి. మాకు అప్పులు వద్దు. మా భావితరాల మీద ఆ భారం వద్దు. రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలి. ఈ ప్రకటన మోదీ గారు చేయాలి. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలి. అలాగే 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం" అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రధాని మోడీ అమరావతి రాకవేళ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై విజయవాడలో బీజేవైఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ దగ్గర నిరసనకు దిగిన షర్మిలపై బీజేవైఎం కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)