తెలంగాణలో బీఆర్ఎస్ కు ఫిక్స్ చేసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జూన్ 2 న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేటీఆర్ కు మరోసారి ఫార్ములా ఈ రేసు కేసులో నోటీసులు జారీ అయ్యాయి. కవిత తనకు పార్టీలో ప్రాధాన్యత పైన పట్టు బడుతున్నారు. కవిత రాసిన లేఖ పార్టీలో సంచలనంగా మారుతోంది. కేసీఆర్ సన్నిహితులు మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకుంటే తన దారి తాను చూసుకుంటానని కవిత భీష్మించినట్లు సమాచారం. ఇదే సమయంలో కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు అందాయి. ఇలా అన్ని వైపులా మూకుమ్మడిగా వస్తున్న సమస్యల వేళ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణుల సూచనలు, సలహాల అనంతరం జూన్ ఐదో తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 9న విచారణకు హాజరవుతా నని ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు కూడా. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే వంద కుపైగా అధికారులు, ఇతర వ్యక్తులను విచారించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నడుచుకున్నామని వారిలో అత్యధికులు కమిషన్కు స్పష్టం చేశారు. తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ విద్యుత్తు అవకతవకలపై నియమించిన కమిషన్ నోటీసులు జారీ చేసిన సమయంలో కేసీఆర్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు నుంచి ఊరట పొందారు. దాంతో, కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన హాజరుపై సందిగ్ధం నెలకొంది. కేసీఆర్ రెండు దఫాలుగా ఎర్రవల్లి ఫాంహౌజ్లో మాజీ మంత్రి హరీశ్ రావుతో ఒకసారి కేటీఆర్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నోటీసులపై ఏవిధంగా స్పందించాలనే అంశం పైన సమాలోచన చేసినట్లు తెలిసింది. ఇప్పటికే విచారణకు వెళ్లి వచ్చిన రిటైర్డ్ ఇంజనీర్లతోనూ బీఆర్ఎస్ అధినేత సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీటికితోడు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ లకు డ్యామేజీ అయ్యేవరకు జరిగిన పరిణామాలపై సమాచారం సేకరించారు. సమస్యలు తలెత్త డానికి ప్రధాన కారణాలు ఏమిటన్న దానిపైనా ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, దేశ వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న వాటికి సంబంధించిన సమాచా రాన్ని కూడా సేకరించినట్లు తెలిసింది.
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం
May 28, 2025
0
Tags