ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాక్‌కు నీటి కటకటా ?

Telugu Lo Computer
0


సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేయడంతో దాని ప్రభావం పాక్‌పై ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచే కనిపించనుంది. ఇండస్‌ రివర్‌ సిస్టమ్‌ అథారిటీ (ఐఎస్‌ఆర్‌ఏ) వేసిన అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. పాక్‌కు వెళ్లే నీటిలో 21% మేరకు కోత పడొచ్చని పేర్కొంది. ముఖ్యంగా చీనాబ్‌లో నీటి లభ్యతలో తగ్గుదలే దీనికి కారణం అవుతుందని తేల్చింది. ఇప్పటికే సలాల, బగ్‌లిహార్‌ డ్యామ్‌ల గేట్లు మూసేయడంతో పాక్‌కు వెళ్లే నీరు చాలావరకు తగ్గింది. మరాల వద్ద నీటి కొరత దృశ్యాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఖరీఫ్‌ సీజన్‌పై పడనుంది. ఇలాంటి చర్యలే కిషన్‌ గంగాపై కూడా భారత్‌ భావిస్తోంది. మే నుంచి సెప్టెంబర్‌ వరకు ఖరీఫ్‌ సీజన్‌కు నీటి లభ్యతను అంచనా వేయడానికి ఐఎస్‌ఆర్‌ఏ సమావేశమైంది. ''మే-జూన్‌ 10వ తేదీ వరకు ఖరీఫ్‌ ప్రారంభంలో, ఆ తర్వాత నీటి లభ్యతను సమీక్షించడానికి ఐఎస్‌ఆర్‌ఏ సమావేశమైంది. భారత్‌ నిర్ణయంతో మరాల వద్ద చీనాబ్‌ నదిలో నీటి లభ్యత పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఖరీఫ్‌ ప్రారంభ సీజన్‌లో మరింత నీటి కొరతకు దారితీస్తుంది'' అని పేర్కొంది. చీనాబ్‌, రావి నదుల్లో నీరు సాధారణంగా ప్రవహిస్తేనే మొత్తం పాకిస్థాన్‌కు సీజన్‌ ప్రారంభంలో 21 శాతం నీరు తగ్గినట్లు అంచనా వేసింది. ఇక రోజువారీ సమీక్షలు జరిపి.. చీనాబ్‌లో నీటి లభ్యత తగ్గితే తమ అంచనాలను మారుస్తామని పేర్కొంది. అక్నూర్‌లో చీనాబ్‌ నదిలో నీటి ప్రవాహం బాగా తగ్గిపోయింది. దీంతో పర్యాటకులు నది మధ్యలోకి వెళ్లి దిగి ఫొటోలు తీసుకొంటున్నారంటే ప్రవాహం ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితికి సలాల్‌, బగ్‌లిహార్‌ డ్యామ్‌ల మూసివేతే కారణంగా నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)