అమెరికా వెళ్లేందుకు ఇంటి నుంచి పయనమై మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. రెండు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో ఐదుగురు గాయపడిన ఘటన శ్రీకాళహస్తి శివారు వీఎంపల్లె వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగింది. శ్రీకాళహస్తి టూటౌన్ సీఐ వెంకటేష్ తెలిపిన ప్రకారం శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెంకు చెందిన మధుసూదన్రెడ్డి (42) అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయం నుంచి అమెరికా వెళ్లాలి. తన సోదరి కుటుంబాన్ని కలిసి సోమవారం విమానం ఎక్కేందుకని ఆదివారం నెల్లూరుకు కారులో బయలుదేరారు. ఇక, ఒంగోలుకు చెందిన కార్పెంటర్ ప్రభుదాస్ అల్లుడు గిరీష్ కుమార్ ఇటీవల సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. దీంతో శ్రీవారి దర్శనార్థం వీరు కుటుంబంతో కలిసి కారులో కారులో బయలుదేరారు. ఆదివారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి సమీపం వీఎంపల్లె వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అమ్మపాళెం నుంచి నెల్లూరుకు వెళుతున్న మధుసూదన్రెడ్డి కారు టైరు పంక్చరవడంతో జాతీయ రహదారి డివైడర్ను దాటి అవతలివైపునకు దూసుకొచ్చి తిరుపతి వైపు వెళ్తున్న ప్రభుదాస్ కారును ఢీకొట్టింది. రెండు కార్లలోని క్షతగాత్రులను స్థానికులు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మధుసూదన్రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కరకంబాడి వద్ద ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరో కారులోని ప్రభుదాస్, అతడి కుమారుడు స్వామి, భార్య హర్షిత, అల్లుడు గిరీ్షకుమార్, మరో బాలుడు సాయిరాఘవ శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గిరీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాఫ్ట్వేర్ ఇంజనీర్కు తీవ్ర గాయాలు
April 07, 2025
0
Tags