బందరులో పేర్ని నాని హల్ చల్ !

Telugu Lo Computer
0


బందరులో అనుమతులు లేకుండా నిర్మించిన వైసిపి జిల్లా కార్యాలయం వద్ద మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హల్ చల్ చేశారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించాలన్న ఆలోచనతో సన్నాహాలు మొదలుపెట్టిన ఆయన వైసీపీ కార్యాలయంలోకి వెళ్లడానికి ఐరన్ గ్రిల్స్ తో ర్యాంప్ నిర్మాణం చేయించాలని ప్రయత్నించారు. అయితే దీనిని మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పేర్ని నాని అక్కడ నానా హంగామా చేశారు. వైసీపీ  ప్రభుత్వ హయాంలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 33 సంవత్సరాల పాటు లీజ్ కు తీసుకొని అందులో అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అంతేకాదు ఈ కార్యాలయం లోపలికి వెళ్లడానికి డ్రెయిన్ పై చేసిన ర్యాంప్ నిర్మాణాన్ని సైతం కూలగొట్టారు. తాజాగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మళ్లీ డ్రైనేజ్ పైన ర్యాంప్ నిర్మించాలని ప్రయత్నిస్తున్న క్రమంలో అధికారులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బందరు డిఎస్పీ రాజా పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లి పేర్ని నానితో చర్చలు జరిపారు. అయితే తమకు న్యాయస్థానం నుండి కానీ నగరపాలక సంస్థ నుండి గాని ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని పేర్ని నాని తెలిపారు. కావాలని ఇది కక్ష సాధింపు చర్యలలో భాగంగా చేస్తున్న కుట్ర అని ఆయన ఆరోపించారు. అయితే పోలీసులు అనుమతులు లేని నిర్మాణం వద్ద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదని ఆయనకు చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన కూటమి సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. కోర్టులో ఉన్న అంశంపై తుది తీర్పు వచ్చేవరకు చట్ట ప్రకారం పార్టీ కార్యాలయంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక వైసిపి పార్టీ కార్యాలయం ముందు పేర్ని నాని హల్చల్ చేయడంతో తాజాగా ఈ వ్యవహారం పైన మచిలీపట్నంలో చర్చ జరుగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)