ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని శ్రీ కాశినాయన మండల కేంద్రంలో అవధూత కాశిరెడ్డి నాయన పరమపదించారు. ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది. అయితే ఇవి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని ఉన్నట్టుండి అధికారులు కొన్ని భవనాలను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందన్నారు. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం బాధాకరం : సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాం : లోకేశ్ ట్వీట్
March 12, 2025
0
Tags