మయన్మార్, థాయ్ లాండ్ లో శుక్రవారం రెండు భారీ భూకంపాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో మరణించినవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మరణించిన వారి సంఖ్య 1000 దాటేసింది. ఒక్క మయన్మార్ లోనే 1002 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు తెలిపారు. మరో 2370 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. అటు బ్యాంకాక్ లో 10 మంది మరణించారు. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. ఈ విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తుతో కుందేలైన మయన్మార్, థాయ్ లాండ్ ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద మయన్మార్ కు 15టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ తెలిపారు.
వెయ్యి దాటిన మయన్మార్, థాయ్ లాండ్ భూకంప మృతుల సంఖ్య
March 29, 2025
0
Tags