కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తూ దేశ విభజనకు కుట్రలు చేస్తున్నాయని కేంద్ర మత్రి బండి సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశాన్ని విడగొట్టడానికి కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్న వారిని రాళ్లతో కొట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మతం పేరుతో దేశాన్ని విభజించిందని పేర్కొన్న ఆయన ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశ విభజనకు కుట్రలు చేస్తోందని విమర్శలు చేశారు.రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ తెలిపారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబం పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ కుటుంబం చేసిన అవినీతిపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. పగ తీర్చుకునే రాజకీయాలు చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు ఒకటే అనే విషయం అర్థం అవుతుందని బండి సంజయ్ అన్నారు. ప్రజలకు నేటి నుంచి సన్న బియ్యం ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని కానీ సన్న బియ్యం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. కేజీ బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు ఖర్చు చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పది రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజలందరికీ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని బండి సంజయ్ అన్నారు. అయితే రేషన్ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను కార్డ్స్ పై పెట్టాలి అని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ, బి ఆర్ ఎస్ పార్టీ లు తమ అభ్యర్థులను పెట్టటం లేదు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ లో జరిగే లోకల్ బాడీస్ ఎన్నికలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ఎవరికీ వారే పోటీ చేసే దమ్ముందా అని బండి సంజయ్ సవాల్ విసిరారు .
దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్న వారిని రాళ్లతో కొట్టాలి !
March 30, 2025
0
Tags