మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సీఐడీ కస్టడీకి వంశీని ఇస్తూ కోర్టు ఆదేశించింది. వంశీని పది రోజుల పాటు కస్టడీ కోరుతూ విజయవాడ సీఐడీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు. ఈరోజు విచారణకు రాగా.. ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంలో కార్లు, ఫర్నీచర్ దగ్ధం చేసిన ఘటనపై వంశీపై కేసు నమోదు అయ్యింది. వంశీ కనుసన్నల్లోనే దాడి వ్యవహారం మొత్తం నడిచినట్లు తెలుస్తోంది. అప్పట్లో గన్నవరం ఎమ్మెల్యేగా వంశీ ఉండగా.. ఆయన ఆదేశాలు లేనిదే అనునాయులు ఇలా దాడులకు పాల్పడే అవకాశం లేదని పోలీసులు భావించారు. దీనికి సంబంధించి సీఐడీ అధికారులు వివిధ రూపాల్లో సాంకేతిపరమైన ఆధారాలను సేకరించారు. వీటన్నింటినీ కోర్టులో సబ్మిట్ చేశారు సీఐడీ అధికారులు. వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే వంశీ న్యాయవాదులు కూడా ఈ కేసులో 72వ నిందితుడిగా ఉన్న వంశీని కస్టడీకి అవసరం లేదని, అతని పాత్ర లేదని వాదించారు. అయితే వంశీ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన ఆదేశాలు లేకుండా అక్కడ ఏదీ జరిగే అవకాశం లేదని ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో ప్రాసిక్యూషన్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. మూడు రోజుల పాటు వంశీని సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే దీనికి సంబంధించి ఆర్డర్ కాపీ సాయంత్రం వెలువరిస్తామని న్యాయమూర్తి చెప్పారు. వంశీని ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు విచారించే అవకాశం ఉంది అనే అంశాలపై ఈరోజు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ !
March 20, 2025
0
Tags