హైదరాబాద్ లో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన రోడ్ల నిర్మాణం

Telugu Lo Computer
0

హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ సమస్య కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్‌) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హెచ్ఆర్‌డీసీఎల్ తో జరిపిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 49 రోడ్ల నిర్మాణం,విస్తరణపై సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య ప్రజలు ఎటువంటి అవాంతరాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారులు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంటర్ లింకింగ్ రహదారుల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తరణ విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వారికి ట్రావెలింగ్ సమయం కలిసి వచ్చేలా ఉండాలన్నారు. ఈ క్రమంలో అదనపు భూసేకరణకు కొంత అధిక వ్యయమైనా వెనుకాడవద్దని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌, పురపాలక, పట్టణభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)