ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. అత్యధికంగా 4 శాతం వరకు ఈ పెంపు ఉంటుందని తెలిపింది. తయారీ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో వాహన ధరల పెంపు నిర్ణయం తప్పలేదని, దీంతో కొంతభాగం వినియోగదారులకు బదిలీ చేయడం మినహా వేరే మార్గం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. మోడల్ని బట్టి ధరల పెంపు ఉంటుందని పేర్కొంది. దేశీయ విపణిలో మారుతీ ఎంట్రీ లెవల్ ఆల్టో కే-10 నుంచి మల్టీపర్పస్ వెహికల్ ఇన్విక్టో వరకు పలు రకాల మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు ఉన్నాయి. కాగా కంపెనీ తమ వాహనాల ధరలను పెంచడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల మోడళ్లను బట్టి గరిష్ఠంగా రూ.32,500 వరకు ధరలను పెంచింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలను అమలుచేస్తోంది. పెంపు వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఈ కంపెనీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఏప్రిల్ 1 నుంచి మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు !
March 17, 2025
0
Tags