సిక్కుల ఊచకోత కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ని దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు

Telugu Lo Computer
0


కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ని 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. సిక్కుల ఊచకోత సమయంలో సరస్వతి విహార్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల హత్యల కేసులో సజ్జన్ కుమార్ ప్రమేయం ఉన్నట్లుగా కోర్టు చెప్పింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా దోషిగా తేల్చింది, ఫిబ్రవరి 18న తీర్పును వెలువరించనున్నారు. అదే రోజు శిక్షలను ఖరారు చేయనున్నారు. ఈ కేసులో తీర్పు కోసం సజ్జన్ కుమార్‌ని తీహార్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు నవంబర్ 01, 1984 జస్వంత్ సింత్, అతడి కుమారుడు తరణ్ దీప్ సింగ్ హత్యలకు సంబంధించింది. పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్ మొదట కేసు నమోదు చేసినప్పటికీ, ఆ తర్వాత దీనిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. డిసెంబర్ 16, 2021న, కోర్టు కుమార్‌పై అభియోగాలు మోపింది. ఇతడి ప్రమేయం ఉన్నట్లు తేల్చింది. ప్రాసిక్యూషన్ ప్రకారం మారణాయుధాలతో సాయుధులైన ఒక భారీ గుంపు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి పెద్ద ఎత్తున దోపిడీలు, దహనాలతో పాటు సిక్కుల్ని టార్గెట్ చేశారు. ఈ గుంపు తమ ఇంటిపై దాడి చేసి తన భర్త, కొడుకును చంపినట్లు జస్వంత్ సింగ్ భార్య ఫిర్యాదు చేసింది. ఇంట్లో వస్తువుల్ని దోచుకుని వారి ఇంటిని తగులబెట్టినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. సజ్జన్ కుమార్‌పై విచారణ జరుపుతూ ''అతను కేవలం అందులో పాల్గొనే వాడు మాత్రమే కాదని, ఆ గుంపుకు నాయకత్వం వహించాడు'' అందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.


Post a Comment

0Comments

Post a Comment (0)