ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా రైల్వే కోడూరు తాలూకా ఓబులవారిపల్లె మండలం ఎర్రగుంట కోట సమీపంలోని శేషాచలం అడవుల్లో గుండాల కోన అనే ప్రదేశం ఉంది. ఈ ప్రాంతమంతా దట్టమైన శేషాచలం అడవులే. ఎర్రగుంట కోటకు చెందిన ఉర్లగట్టుపోడు అరుంధతి వాడ, మరో గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యాత్రికులు సోమవారం సాయంత్రం బయలుదేరి గుండాల కొన వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని భాకరాపేట వద్ద ఉన్న తలకోన వద్దకు అటవీ మార్గంలోని కాలినడకన వెళ్లి సిద్దేశ్వర ఆలయం వద్ద జాగారం చేయాలనేది వారి లక్ష్యం. ఓబులవారి పల్లి మండలం ఎర్రగుంట కోట మీదుగా పది కిలోమీటర్ల దూరంలోని గుండాల కోన వద్దకు వెళ్లగానే ఏనుగుల గుంపు కనిపించింది. వెంటనే తమ వెంట తీసుకువెళ్లిన డప్పులు ప్లేట్లతో చప్పుడు చేయడంతో ఏనుగులు బెదిరి వారిపై దాడి చేశాయి. మంగళవారం వేకువజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఏనుగులను చూసిన జనం భీకర శబ్దాలు చేశారు. అడవిలో అలజడితో చెలరేగిపోయిన ఏనుగులు జనం పై దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఇంకొందరు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బాధితులను గుండాల కోన నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని రైల్వే కోడూరు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
శేషాచలం అడవుల్లో ఏనుగుల దాడి : ఐదుగురు మృతి
February 25, 2025
0
Tags