వచ్చే రెండేళ్లలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమయ్యే రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారత్ ఆర్థిక వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. అయితే 2026 ఆర్థిక సంవత్సరానికి గానూ గతంలో ఇచ్చిన అంచనాలను సవరించనప్పటికీ.. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలను 0.1 శాతం తగ్గిస్తూ అంచనాలను ప్రకటించింది.. ఈ మేరకు గురువారం గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంటుందని ప్రపంచబ్యాంక్ చెప్పింది.. ప్రభుత్వ సహకారంతో దేశంలో సేవారంగం మరింత విస్తరిస్తుందని వెల్లడించింది. దేశంలో సేవల రంగం నిరంతర విస్తరణ ఉంటుందని.. తయారీ, వ్యాపారరంగం మరింత పుంజుకుంటుందని అంచనా వేసింది. పెట్టుబడి వృద్ధి స్థిరంగా ఉంటుందని వెల్లడించింది. లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, పన్ను సంస్కరణల ద్వారా వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వ కార్యక్రమాల మద్దతుతో మరింత పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ తన ఫ్లాగ్షిప్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికలో పేర్కొంది. అయితే, ప్రపంచబ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 6.5 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇది పెట్టుడులు మందగించడం, బలహీనమైన తయారీ వృద్ధిని ప్రతిబింబిస్తుందని పేర్కొంది. గ్లోబల్ ఎకానమీ 2025 – 2026 రెండింటిలోనూ 2.7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతాయని.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వృద్ధి కూడా రాబోయే రెండేళ్లలో దాదాపు 4 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ : ప్రపంచ బ్యాంక్
January 18, 2025
0
Tags