కపిల్‌శర్మతో పాటు మరికొందరికి బెదిరింపులు !

Telugu Lo Computer
0


సైఫ్‌ ఘటన మరువక ముందే పాపులర్ టీవీ హోస్ట్‌, కమెడియన్‌ కపిల్ శర్మకు బెదిరింపులు వచ్చాయి. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈమెయిల్‌లో వార్నింగ్ ఇచ్చారు. కపిల్ శర్మతో పాటు కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, సింగర్ సుగంధ మిశ్రా, యాక్టర్ రాజ్‌పాల్ యాదవ్‌కు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. పాకిస్థాన్ నుంచి మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అంబోలి పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351(3) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. కపిల్‌ శర్మకి వచ్చిన ఈమెయిల్‌లో 'BISHNU' అనే సైన్ ఉంది. ఈమధ్య మీరు చేసే పనులు చూస్తున్నాం. ఒక సున్నితమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ఇది పబ్లిసిటీ స్టంట్ లేదా వేధింపులు కాదు. దయచేసి ఈ మెసేజ్‌ని సీరియస్‌గా, కాన్ఫిడెన్షియల్‌గా భావించండి.' అని మెయిల్‌లో రాశారు. దీనికి ఎనిమిది గంటల్లోపు సమాధానం ఇవ్వాలని పంపిన వ్యక్తి కపిల్‌ను డిమాండ్ చేశాడు. రెస్పాండ్‌ కాకపోతే పర్సనల్‌, ప్రొఫెషనల్‌ రెండింటి పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు. పాపులర్ యాక్టర్, కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు 2024 డిసెంబర్ 14నే ఈమెయిల్ వచ్చింది. కానీ అది స్పామ్ ఫోల్డర్‌లోకి వెళ్లింది. తర్వాత దీని గురించి డిసెంబర్ 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుగంధ మిశ్రా, రెమో డిసౌజాకు కూడా ఇదే తరహా ఈమెయిల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత అంబోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని గురించి అంబోలి పోలీస్, సైబర్ క్రైమ్ విభాగానికి కంప్లైంట్ చేశానని రాజ్‌పాల్ యాదవ్ చెప్పారు. తానొక ఆర్టిస్ట్‌ని అని, ప్రేక్షకులను అలరించడంపైనే తని దృష్టి ఉంటుందన్నారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)