కాంగ్రెస్ పార్టీ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తోంది !

Telugu Lo Computer
0


కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే హిందూ, ముస్లిం వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీలో  ఫైర్ లేదు కానీ, కాంగ్రెస్ మాత్రం నిప్పుతో చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''హిందూ, ముస్లిం వర్గాల మధ్య చిచ్చు పెట్టి.. సామాజిక సామరస్యానికి భంగం కలిగించాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ముస్లిం సమాజాన్ని ఆ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోంది. వారికి నేను ఓ సలహా ఇవ్వాలని అనుకుంటున్నా.. కేవలం ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కోసం రాజకీయాలు చేయకూడదు. దేశాభివృద్ధే రాజకీయాల లక్ష్యం'' అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హిందూ-ముస్లిం కార్డ్‌ని ఉపయోగించాలని అనుకుంటోందని, ఆ పార్టీ సైకోసిస్ భయాన్ని సృష్టించాలని చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు ఎలాంటి సమస్య లేదని.. కులం, మతం పేరుతో సమాజాన్ని విభజించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేయాలని యోచిస్తోందని, ఒకవేళ అది అమల్లోకి వస్తే దేశంలో మాంద్యం ఏర్పడుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ స్కీమ్‌ని అర్జెంటీనా, వెనిజులా అమలు చేశాయని.. దాంతో అవి వినాశకరమైన పరిణామాలను ఎదుర్కొన్నాయని చెప్పారు. ఇది అమలైతే.. పెట్టుబడిదారులు భారత్‌పై విశ్వాసాన్ని కోల్పోతారన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు పక్కాగా గెలుస్తుందని.. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 400 సీట్ల మార్కును దాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తామిచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)