మహిళా ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ వరాల వర్షం కురిపించింది. స్త్రీల సంక్షేమమే లక్ష్యంగా నారీ న్యాయ్ గ్యారెంటీని ప్రకటించింది. ఈ పథకాల ద్వారా ఏటా పేద కుటుంబాలకు చెందిన మహిళలకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. మహాలక్ష్మి, ఆధి ఆబది పూరా హక్, శక్తి కా సమ్మాన్, అధికార్ మైత్రి, సావిత్రీబాయి ఫూలే హాస్టల్ వంటి ఐదు గ్యారెంటీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరిగే కొత్త రిక్రూట్మెంట్లలో సగానికిపైగా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరాలు వెల్లడించారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ ఆదాయానికి కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు చేయనున్నారు. మహిళలకు వారి హక్కులపై అవగాహనతో పాటు సాధికారత కల్పించేందుకు ప్రతి పంచాయతీలో ఒక పారాలీగల్ ప్రొఫెషనల్ను నియమించనుంది. శ్రామిక మహిళలకు సురక్షితమైన ఆవాసం కల్పించేందుకు జిల్లా ప్రధాన కార్యాలయంలో పనిచేసే మహిళలకు ఒక హాస్టల్ను నిర్మించనుంది.
మహిళలకు ఐదు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ !
March 13, 2024
0
Tags