దేశంలో విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్-2 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు నెలలు పొడిగించబోతోందంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం 2024 మార్చి 31తో ముగియనున్న వేళ మరో నాలుగు నెలల పాటు గడువును పొడిగిస్తారని, ఇందుకోసం అదనంగా రూ.500 కోట్లు కేటాయిస్తారని వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని కేంద్రం స్పష్టంచేసింది. ఫేమ్ పేరిట ఇప్పటికే రెండు దఫాల్లో విద్యుత్తు వాహన కొనుగోళ్లకు రాయితీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్లు, ఫోర్ వీలర్లకు రాయితీ వర్తిస్తుంది. తొలుత ఫేమ్-2 కింద రూ.10వేల కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత దాన్ని రూ.11,500 కోట్లకు పెంచారు. గడువు ముగిసే వరకు లేదా నిధులు అందుబాటులో ఉండే వరకు అని గతంలోనే భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. అయితే, సార్వత్రిక ఎన్నికల వేళ గడువు పొడిగిస్తారంటూ వార్తలు రాగా.. అవన్నీ అవాస్తవమని కొట్టి పారేసింది.
ఫేమ్-2 గడువు పొడిగింపు అవాస్తవం !
March 07, 2024
0
Tags