2025-26 అకడమిక్ సెషన్ నుంచి ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పుర్లో పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ.. '2025-26 అకడమిక్ సెషన్ నుంచి పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు రాసే వీలు కల్పించనున్నాం. ఇందులో ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడికి దూరం చేసిన నాణ్యమైన విద్యను అందించడమే మా సర్కారు లక్ష్యం. ఈ ఫార్ములా దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా తీర్చిదిద్దుతుంది' అని వెల్లడించారు. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ గతేడాది ఆగస్టులో కొత్త కరికులమ్ ఫ్రేమ్వర్క్ను రూపొందించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం.. టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని ప్రతిపాదించారు. ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటు మంచి పనితీరు కనబరిచేందుకు వీలుంటుందని విద్యాశాఖ పేర్కొంది. అయితే, పరీక్షలు సెమిస్టర్ పద్ధతిలో పెడతారా, లేక మొత్తం సిలబస్పై రెండు సార్లు నిర్వహిస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. ఇక, కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం.. 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్లను ఖచ్చితంగా అభ్యసించాలని.. వీటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలన్న షరతు విధించారు.
వచ్చే ఏడాది నుంచి ఏడాదికి రెండుసార్లు పబ్లిక్ పరీక్షలు !
February 20, 2024
0
Tags