నగదు రహిత చెల్లింపుల్లో అమెరికాను భారత్ అధిగమించిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. మన దేశంలో ఒక నెలలో చేసిన డిజిటల్ చెల్లింపులు అమెరికాలో మూడేళ్లలో జరుగుతాయని తెలిపారు. నైజీరియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాక్సిన్ తయారీ, సరఫరా గురించి మాట్లాడారు. ''ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో భారతీయుల జీవన విధానం సులభంగా మారింది. దేశంలో అతి తక్కువ మంది నగదు చెల్లింపులు చేస్తున్నారు. భారత్లో ఒక నెలలో జరిగిన నగదు రహిత చెల్లింపులు.. అమెరికాలో మూడేళ్లలో జరుగుతున్నాయి. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదుగుతున్నాం. దేశంలో రవాణా, మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి. కరోనా సమయంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి.. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందజేసే స్థాయికి ఎదిగాం'' అని జైశంకర్ తెలిపారు. పశ్చిమ ఆఫ్రికా మిషన్లో భాగంగా జైశంకర్ నైజీరియాలో పర్యటిస్తున్నారు. వ్యాపారపరంగా భారత్-నైజీరియాల మధ్య సహాయసహకారాలపై అక్కడి పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చించినట్లు తెలిపారు. అంతకుముందు పశ్చిమ ఆఫ్రికాలోని భారత రాయబారులతో సమావేశమయ్యారు.
నగదు రహిత చెల్లింపుల్లో అమెరికాను అధిగమించిన భారత్ !
January 22, 2024
0
Tags