ఇజ్రాయెల్ సైన్యానికి మద్దతుగా ఆ దేశ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ సైతం యుద్ధంలో భాగస్వామ్యమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఓ అంతర్జాతీయ వార్తా ఛానెల్తో మాట్లాడుతూ తాము నాజీలతో యుద్ధం చేస్తున్నామన్నారు. గాజాకు నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలు నిలిపివేయడంపై టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ''మీరు నిజంగానే ఈ ప్రశ్న అడుగుతున్నారా? పాలస్తీనా పౌరుల గురించి ప్రశ్నిస్తున్న మీరు.. ఇజ్రాయెల్లో ఏం జరిగిందో చూడలేదా? మేం పౌరులను లక్ష్యంగా చేసుకోలేదు. నాజీలతో (హమాస్ మిలిటెంట్లను ఉద్దేశించి) యుద్ధం చేస్తున్నాం. ప్రపంచం వారికి ఏమైనా ఇవ్వొచ్చు. నా దేశం మాత్రం శత్రువుకు నీరు, విద్యుత్, ఇంధనాన్ని మాత్రం ఇవ్వదు. ఈ పరిస్థితి మేం బాధ్యులం కాదు''అని బెన్నెట్ తెలిపారు. హమాస్పై పోరులో ఇజ్రాయెల్కు అన్ని విధాల తోడుంటామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు అవసరమైన ఆయుధాలు, సైనిక సహాయాన్ని కూడా అందించనున్నట్లు అమెరికా ఇప్పటికే పేర్కొంది. ఇందుకు సంబంధించి తొలి బ్యాచ్ మందుగుండు సామగ్రి ఇజ్రాయెల్కు చేరుకుంది. మరోవైపు గాజాలోని 750 హమాస్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరువైపులా దాడుల్లో ఇప్పటి వరకు 2,800 మంది మరణించినట్లు సమాచారం.
నాజీలతో యుద్ధం చేస్తున్నాం: నఫ్తాలీ బెన్నెట్
October 13, 2023
0
Tags