తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో భారాస ఎంపీ, ఆ పార్టీ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు తెలిపారు. ''కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరం. దాడికి పాల్పడిన నిందితుడు ఓ ఛానెల్ రిపోర్టర్ అని వెబ్సైట్లో ఉంది. ఫేస్బుక్ పేజీలో కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫొటోలు ఉన్నాయి. నిందితుడు ఏ పార్టీ వ్యక్తి అనేది సీపీ స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేది. ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్లు మా కార్యకర్తలైతే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. దళితబంధు రాలేదనే ఆవేదనతోనే దాడి చేశాడని మీడియాలో వచ్చింది. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు కార్యకర్తలు నమ్మొద్దు'' అని రఘునందన్ రావు అన్నారు. దాడి తర్వాత భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
కొత్త ప్రభాకర్రెడ్డి దాడిపై నా ప్రమేయం లేదు !
October 30, 2023
0
Tags