తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై భాజపా ఎంపీ నిషికాంత్ దూబే తాజాగా మరిన్ని ఆరోపణలు చేశారు. ఆమె భారత్లో ఉండగా ఎంపీ లోక్సభ ఐడీని దుబాయ్ నుంచి మరొకరు వినియోగించారని పరోక్షంగా ఆరోపించారు. ఈ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దర్యాప్తు సంస్థలకు వెల్లడించినట్లు ఆయన తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ''ఓ ఎంపీ (మహువా మొయిత్రాను ఉద్దేశిస్తూ) డబ్బుల కోసం దేశ భద్రతను తాకట్టు పెట్టారు. ఆ ఎంపీ భారత్లో ఉండగానే ఆ వ్యక్తి పార్లమెంట్ ఐడీని దుబాయ్ నుంచి ఓపెన్ చేశారు. ఈ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దర్యాప్తు సంస్థలకు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ సహా ఆర్థికశాఖ, కేంద్ర సంస్థలు ఇలా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్ఐసీని వినియోగిస్తోంది. ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు దీనిపై రాజకీయం చేయాలనుకుంటున్నాయా? ఇక దీనిపై నిర్ణయం ప్రజలదే'' అని నిషికాంత్ దూబే మహువా పేరు చెప్పకుండా పరోక్షంగా ఆరోపణలు చేశారు. అయితే, ఏ ఏజెన్సీకి సమాచారం అందిందనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అదానీ గ్రూప్ను, ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా రూ.2 కోట్లతో పాటు ఐఫోన్ వంటి ఖరీదైన బహుమతులు తీసుకున్నారని ఇటీవల దూబే లోక్సభ స్పీకర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎథిక్స్ కమిటీ వద్దకు చేరింది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని ఆఫిడవిట్ తమకు అందినట్లు లోక్సభ ఎథిక్స్ కమిటీ వెల్లడించింది. మరోవైపు, హీరానందాని అఫిడవిట్లోని కొన్ని విషయాలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అదానీ లక్ష్యంగా పార్లమెంటులో ప్రశ్నలడగటానికి మొయిత్రా పార్లమెంటరీ లాగిన్ను ఉపయోగించుకున్నానని అఫిడవిట్లో హీరానందాని అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మహువా తీవ్రంగా స్పందించారు. హీరానందానిపై ప్రధాని కార్యాలయం ఒత్తిడి తెచ్చి, తెల్లకాగితంపై సంతకం చేయించిందని ఆరోపించారు.
దుబాయ్ నుంచి మహువా ఐడీని వాడారు !
October 21, 2023
0
Tags