350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం !

Telugu Lo Computer
0


17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన ఆయుధం తిరిగి భారత్‌కు రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఉపయోగించిన వాఘ్ నఖ్ (పులి గోళ్లు టైగర్ క్లా)ను స్వదేశానికి తీసుకురానున్నారు. నవంబరులో ఇది భారత్‌కు చేరుకోనుంది. మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ ఆయుధాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన ఒప్పంద పత్రాలపై మంగళవారం లండన్‌లో సంతకాలు చేయనున్నారు. "తొలి దశలో భాగంగా వాఘ్ నఖ్‌ను నవంబరులో భారత్‌కు తీసుకొస్తాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్‌ను ఓడించిన రోజునే దాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంలో దాన్ని ప్రదర్శనకు ఉంచుతాం" అని సుధీర్ తెలిపారు. అలాగే దేశం లోని మరో నాలుగు ప్రాంతాల్లో ఈ ఆయుధాన్ని ప్రదర్శనకు ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు మ్యూజియం వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్‌బర్ట్ మ్యూజియంలో వాఘ్ నఖ్ ఉంది. ఇది 17 వ శతాబ్దం నాటిదని మ్యూజియం రికార్డుల్లో పేర్కొన్నారు. బీజపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్‌ను ఇదే వాఘ్ నఖ్‌తో ఛత్రపతి శివాజీ హతమార్చినట్టు చరిత్ర చెబుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)