కేరళలో స్కూల్స్‌, ఆఫీసులు బంద్‌ !

Telugu Lo Computer
0


కేరళలో నిఫా వైరస్‌ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుండంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కోజికోడ్‌ జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాలో నిఫా వైరస్‌ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరితో సన్నిహితంగా ఉన్న 130 మంది రక్త నమూనాలను సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు జిల్లాలోని ఏడు గ్రామ పంచాయితీ (తిరువళ్లూర్‌, కుట్టియేడి, కయక్కోడి, విల్లయపల్లి, కవిలుంపర, అయన్‌చేరి, మరుతోంకర) లను కంటైన్‌మెంట్‌ జోన్‌ లుగా ప్రకటించింది. ఆ గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను, కార్యాలయాలను అధికారులు మూసివేయించారు. జంతువుల నుండి ప్రజలకు ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా సోకుతుంది. ఈ వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించాక 4 నుంచి 15 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. వైరస్‌ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్‌ సోకిన వారిలో దాదాపు 75% మంది మరణించే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. దీనికి ప్రత్యేకమైన చికిత్స , మందులు అందుబాటులో లేవు. మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వైరస్ కు దూరంగా ఉండవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)