మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను కలిసేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఉన్నట్టుండి ఆయన తలపై పసుపు చల్లాడు. ఆ చర్యతో మంత్రి అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు ఆన్లైన్ చక్కర్లు కొడుతున్నాయి. రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్న ఓ వర్గానికి చెందిన ప్రజలను శుక్రవారం విఖే పాటిల్ కలుసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మంత్రికి ఒక లేఖను ఇవ్వగా, ఆయన దానిని చదువుతున్నారు. అంతలోనే వారిలో ఒకరు తన జేబులో నుంచి పసుపు తీసి పాటిల్ తలపై చల్లాడు. దాంతో అవాక్కైన మంత్రి అతడికి దూరం జరిగారు. ఈ చర్యతో ఆగ్రహానికి గురైన మంత్రి అనుచరులు అతడిని నేలమీదకు ఈడ్చి, దాడి చేశారు. మరోపక్క తన్నులు తింటూ కూడా ఆ వ్యక్తి రిజర్వేషన్ల గురించి తన డిమాండ్ వినిపించాడు. సోలాపుర్లోని ప్రభుత్వ రెస్ట్ హౌస్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తి పేరు శేఖర్ బంగలే. అతడు తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన వర్గం ఎదుర్కొంటోన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే అలా చేసినట్లు చెప్పాడు. ఎస్టీ విభాగంలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరాడు. ఈ ఘటనపై మంత్రి స్పందించారు. పసుపు సంతోషానికి గుర్తు అని, అందులో తనకు ఏ తప్పూ కనిపించలేదన్నారు. అలాగే నిరసనకారులపై ఎలాంటి చర్యలకు ఆదేశించలేదని చెప్పారు.
మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కు చేదు అనుభవం !
September 08, 2023
0
Tags