గుజరాత్ లోని జామ్నగర్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నా మట్టి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా మునిసిపల్ మేయర్ బినా కొతారి, ఎంపీ పూనంబెన్ మాదం మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనిపై రివాబా జడేజా స్పందిస్తూ అమర జవాన్లకు ఈ కార్యక్రమంలో ఎంపీ పూనంబెన్ మాదం పాదరక్షలు విప్పకుండానే నివాళులు అర్పించారని అన్నారు. తాను అమర జవాన్లకు నివాళులు అర్పించే ముందు పాదరక్షలు విప్పానని తెలిపారు. ఆ తర్వాత అక్కడున్న వారంతా తనను చూసి తనలాగే పాదరక్షలు విప్పి నివాళులు అర్పించారని అన్నారు. ఆ సమయంలో తనను ఎద్దేవా చేస్తూ ఎంపీ పూనంబెన్ కామెంట్స్ చేశారని, తెలివి మించిపోయిందని తనను అన్నారని రివాబా జడేజా తెలిపారు. ఆ వ్యాఖ్యలు తనకు వినపడ్డాయని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల్లో రాష్ట్రపతి, ప్రధాని కూడా పాదరక్షలు విప్పరని ఆ ఎంపీ అన్నారని వివరించారు. దీంతో తాను ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. ఆ సమయంలో మేయర్ బినా కొతారీ అనవసరంగా జోక్యం చేసుకుని ఎంపీకి మద్దతుగా మాట్లాడడానికి ప్రయత్నించారని చెప్పారు.
మహిళా ఎంపీతో రివాబా జడేజా గొడవ !
August 17, 2023
0
Tags