కీలక దశలో ఇస్రోకు నాసా సహకారం ?

Telugu Lo Computer
0


భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3, కీలక దశకు చేరుకుంది. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోన్నాయి. బుధవారం సాయంత్రం 6:04 నిమిషాలకు ఈ రెండూ చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ కానున్నాయి. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలమైన నేపథ్యంలో.. ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. అదే సమయంలో రష్యాకు చెందిన మూన్ మిషన్ లూనా 25 కూడా విఫలం కావడం, క్రాష్ ల్యాండింగ్ కావడం.. వంటి పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ల్యాండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది ఇస్రో. ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండర్, రోవర్ ల్యాండింగ్‌ను ఖచ్చితంగా విజయవంతం చేసి తీరాలనే పట్టుదలతో ఉంది. లూనా 25 ఎందుకు క్రాష్ ల్యాండింగ్ అయిందనే విషయంపై ఆరా తీస్తోంది. రష్యా స్పేస్ ఏజెన్సీ నుంచి సమాచారాన్ని తెప్పించుకుంటోంది. అదే సమయంలో- నాసా సహకారాన్ని కూడా తీసుకోనుంది ఇస్రో. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైతం ఇస్రోకు సహకరించడానికి ముందుకొచ్చింది. కాన్‌బెర్రాలో నాసాకు చెందిన డీప్ స్పేస్ కమ్యూనికేషన్స్ స్టేషన్-36, డీఎస్ఎస్- 34 నుంచి చంద్రయాన్ 3 మాడ్యుల్ టెలిమెట్రీ, ట్రాకింగ్ కవరేజీని అందుకుంటోంది ఇస్రో. నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఇస్రోకు తనవంతు సహాయ సహకారాలను అందజేస్తోంది. తన కక్ష్యలో ఉన్న ఉపగ్రహం ఈఎస్‌ట్రాక్ నెట్‌వర్క్‌లోని రెండు గ్రౌండ్ స్టేషన్‌ల ద్వారా చంద్రయాన్ మాడ్యుల్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ సెంటర్‌కు దీన్ని పంపిస్తోంది. రోవర్, ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టేంత వరకూ ఈ రెండు ఏజెన్సీల పర్యవేక్షణ కొనసాగుతుందని ఇంజినీర్ రమేష్ చెల్లతురై తెలిపారు. ఈ రెండు ఏజెన్సీల నుంచి మాడ్యుల్ పనితీరుకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు అందుకుంటోన్నామని, ల్యాండింగ్ సమయంలోనూ అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి నాసా, ఈఎస్ఏ సహకరిస్తాయని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)