సెప్టెంబర్‌ 1 నుంచి ఆధార్ ఆధారిత చెల్లింపు తప్పనిసరి !

Telugu Lo Computer
0


జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులకు చెల్లించే ఏకైక విధానంగా ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని అమలు చేయడానికి గడువు ఆగస్టు 31 తర్వాత పొడిగించబడదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నమోదైన వారికి వేతనాలు చెల్లించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)ని ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింద. ఏబీపీఎస్‌ మోడ్‌ను తప్పనిసరిగా స్వీకరించడానికి ప్రారంభ గడువు ఫిబ్రవరి 1, తరువాత మార్చి 31 వరకు, తరువాత జూన్ 30 వరకు, చివరికి ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. జాబ్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించడం వల్ల ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పెరగడంతో పాటు డూప్లికేషన్,జాబ్ కార్డ్‌ల దుర్వినియోగాన్ని నిరోధించవచ్చని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కానీ పలు రాష్ట్రాల అభ్యర్థనలను దృష్టిలోఉంచుకుని ఆగస్టు 31,2023 వరకు చెల్లింపులను ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ లేదా నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌ మోడ్‌ ద్వారా నిర్వహించేందుకు మంత్రిత్వ శాఖ అనుమతించింది. అయితే ఉపాధి హామీ కార్మికుల ఖాతాల్లో 90 శాతానికి పైగా ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానించబడినందున గడువును ఇకపై పొడిగించబోమని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. జూన్‌లో మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, మొత్తం 14.28 కోట్ల క్రియాశీల లబ్ధిదారులలో, 13.75 కోట్ల మంది ఆధార్ నంబర్ సీడింగ్ చేయబడింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, మొత్తం 12.17 కోట్ల ఆధార్ నంబర్లు ప్రామాణీకరించబడ్డాయి. 77.81 శాతం మంది ఆ సమయంలో ఏబీపీఎస్‌కు అర్హులుగా గుర్తించారు. మే 2023లో దాదాపు 88 శాతం వేతన చెల్లింపు ఏబీపీఎస్ ద్వారా జరిగింది. ఉపాధి హామీ లబ్ధిదారులకు జారీ చేసిన జాబ్ కార్డ్‌ల డేటాను కార్మికుడు ఏబీపీఎస్‌కి అర్హులు కాదనే కారణంతో తొలగించలేమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పార్లమెంటులో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రకారం, దాదాపు 1.13 కోట్ల మంది ఉపాధి హామీ కార్మికుల బ్యాంక్ ఖాతాలు లేదా పథకం కింద ఉన్న మొత్తం క్రియాశీల కార్మికులలో దాదాపు ఎనిమిది శాతం మందికి ఇంకా ఆధార్‌ సీడింగ్ జరగలేదు. ఈ ప్రక్రియలో ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి, అస్సాంలో 42 శాతం కంటే ఎక్కువ, అరుణాచల్ ప్రదేశ్‌లో 23 శాతం, మేఘాలయలో 70 శాతానికి పైగా, నాగాలాండ్‌లో 37 శాతం మంది కార్మికుల ఖాతాలు ఆధార్ నంబర్లతో సీడింగ్ చేయబడలేదు. ప్రత్యక్ష ఖాతా బదిలీ మోడ్‌తో పాటు ప్రత్యామ్నాయ చెల్లింపు మోడ్‌గా ఏబీపీఎస్ 2017 నుండి ఉపాధి హామీ పథకం కింద వాడుకలో ఉంది. 100 శాతం ఏబీపీఎస్ చెల్లింపులు జరిపేలా క్యాంపులు నిర్వహించాలని రాష్ట్రాలను కోరినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)