సహారా గ్రూప్నకు చెందిన నాలుగు కోపరేటివ్ సొసైటీల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును 45 రోజుల్లో తిరిగివ్వనున్నట్లు కేంద్రమంత్రి అమిత్షా తెలిపారు. దీనికి సంబంధించి రిఫండ్ పోర్టల్ ను ఆయన మంగళవారం ప్రారంభించారు. దీన్నో చారిత్రక ముందడుగుగా అభివర్ణించారు. తొలిసారి డిపాజిటర్లు సొమ్మును పొందబోతున్నారని చెప్పారు. సహారా గ్రూప్ సంస్థ సెబీ వద్ద డిపాజిట్ చేసిన రూ.24,979 కోట్ల నుంచి రూ.5,000 కోట్లను సహారా గ్రూప్ కో-ఆపరేటివ్ సొసైటీస్ డిపాజిటర్లకు చెల్లించడానికి సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో అనుమతిచ్చింది. ఆ మొత్తం సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్ ఖాతాలో జమ అయ్యింది. ఈ మొత్తాన్ని రానున్న 9 నెలల్లో 10 కోట్ల మంది మదుపరులకు తిరిగి చెల్లిస్తామని కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇందులో భాగంగా తాజాగా పోర్టల్ను ప్రారంభించింది. సహారా గ్రూప్నకు చెందిన కోపరేటివ్ సొసైటీలు అయిన సహారా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహరాయణ్ యూనివర్సల్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, స్టార్స్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీలకు చెందిన మదుపరులకు ఈ మొత్తాలు చెల్లించనున్నారు. రూ.10వేల వరకు డిపాజిట్లు చేసిన వారికి తొలుత చెల్లింపులు చేశాక క్రమంగా ఆ మొత్తాన్ని పెంచుకుంటూ వెళతామని అమిత్ షా తెలిపారు. తొలి దశలో ఈ మొత్తంతో 1.7 కోట్ల డిపాజిటర్లకు చెల్లింపులు చేయొచ్చని పేర్కొన్నారు. రూ.30 వేల వరకు డిపాజిట్ చేసిన వారు 2.5 కోట్ల మంది వరకు ఉన్నారని తెలిపారు. రూ.5వేల కోట్లు వినియోగించిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, మిగిలిన వారికి చెల్లింపులు చేస్తామని అమిత్షా తెలిపారు. ఈ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలంటే ఆధార్తో అనుసంధానం అయిన రిజిస్ట్రేషన్ నంబర్, ఆదార్ అనుసంధానం అయిన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అని పేర్కొన్నారు. రిఫండ్ మొత్తం ఆయా ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు సంబంధించి దగ్గర్లోని కామన్ సర్వీసు సెంటర్లను ఆశ్రయించొచ్చని డిపాజిటర్లకు షా సూచించారు. https://t.me/offerbazaramzon
సహారా డిపాజిటర్ల కోసం రిఫండ్ పోర్టల్ ఏర్పాటు !
July 18, 2023
0
Tags