గుండెపోటుతో నూతన వధూవరులు మృతి

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ బహ్రయిచ్ పరిధిలోని గోధియా గ్రామానికి చెందిన ప్రతాప్ యాదవ్ (24) అనే యువకుడికి పుష్ప (22) అనే యువతితో ఈ నెల 30న ఇరువురి బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. ఇక పెళ్లిలో భాగంగా ఆ రోజు రాత్రి నూతన వధూవరులు వరుడి ఊళ్లో బరాత్ ఏర్పాటు చేశారు. మరుసటి రోజు తెల్లవారు జాము వరకు ఈ బరాత్ జరిగింది. ఇందులో వధూవరులు సైతం కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ఇక మే 31న నూతన దంపతులకు వరుడి ఇంట్లో శోభనం ఏర్పాట్లు చేశారు. ఈ వధూవరులు శోభనం గదిలోకి వెళ్లారు.  శోభనం గదిలోనే గుండెపోటుతో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రిపోర్ట్ లో సైతం వీళ్లు గుండెపోటుతో మరణించారని తేలింది. అసలు శోభనం రోజే నూతన దంపతులకు గుండెపోటు ఎలా వస్తుంది? వీళ్లిద్దరూ హార్ట్ ఎటాక్ తోనే చనిపోయారా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారించారు. ఈ క్రమంలోనే వైద్యులు వీరి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. దీంతో పాటు వీరి శరీరంలోని నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపుతామని వైద్యులు తెలిపారు. అయితే వైద్యులు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా వారున్న శోభనం గదికి వెంటిలేషన్ లేకపోవడం, గత రెండు మూడు రోజుల నుంచి పెళ్లిలో వరుడు, వధువు అలసిపోయి ఉండడం, ఈ క్రమంలోనే వీరికి శోభనం ఏర్పాటు చేయడం. వీటి కారణంగానే ఈ నూతన దంపతులకు ఒకే రోజు గుండెపోటు వచ్చిందని ఆ రిపోర్టు లో వెల్లడైంది. శోభనం గదిలో వెంటిలేషన్ లేకపోవడం కారణంగానే ఈ దంపతులు హార్ట్ ఎటాక్ తో చనిపోయారని పోలీసులు కూడా తెలిపారు. అయితే, వీరి మరణం కాస్త మిస్టరీగా ఉండడంతో ఫోరెన్సిక్ నిపుణులు సైతం వీరి గదిని పరిశీలించి ఆ తర్వాత ఖచ్చితమైన కారణాన్ని వెల్లడిస్తారని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)