కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్ శెట్టర్

Telugu Lo Computer
0


బీజేపీ సీనియర్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రదాన కార్యదర్శులు కె.సి.వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా (కర్నాటక ఇన్‌ఛార్జీ), కెపిసిసి అధ్యక్షుడు డి.కె.శివకుమార్, శాసనసభా పక్షం నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తదితరుల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు బిజెపి టికెట్ ఇవ్వ నిరాకరించడంతో శెట్టర్ హుబ్లీ ధార్వాడ్ (సెంట్రల్) ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు. ఇతరులకు అవకాశం ఇవ్వమని బిజెపి ఈ 67 ఏళ్ల నాయకుడిని ఆదేశించింది. కానీ దాన్ని వ్యతిరేకించి తాను ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లో చేరాక ఆయన మాట్లాడుతూ బిజెపి తనను కించపరిచిందని, టికెట్ కూడా ఇవ్వలేదని, బిజెపి పార్టీ నేడు కొందరి చేతుల్లోనే ఉందని అన్నారు. 'నన్ను బలవంతంగా గెంటేశారు. కర్నాటకలో బిజెపి నిర్మాణం కోసం నేనెంతో పనిచేశాను. కానీ, నేడు కాంగ్రెస్ భావజాలం, సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరాను' అని ఆయన విలేకరులకు తెలిపారు. ఉత్తర కర్నాటకలో ప్రముఖ లింగాయత్ నాయకుడు శెట్టర్, ఆయన ప్రభావం బిజెపిపై తప్పక పడనున్నది. అనేక ప్రాంతాల్లో బిజెపికి సీట్లు తగ్గొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శెట్టర్ బిజెపి ప్రముఖ నాయకుడు. ఆయన కుటుంబం 'జన్‌సంఘ్' ఉన్నప్పటి నుంచే బిజెపికి సేవలందించింది. కిట్టూర్ కర్నాటక ప్రాంతంలో ఆయన ప్రభావశాలి నేత. ఆయన బిజెపికి మంత్రిగా, స్పీకర్‌గా,ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా సేవలందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)