శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో గుర్రపు స్వారీ శిక్షకుడి సహాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చినకొవ్వాడ సముద్ర తీరంలోని రొయ్యల చెరువుల సమీపంలో పాతేసిన మృత దేహాన్ని విశాఖ పోలీసులు బయటకు తీశారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన పతివాడ గౌరీసాయి అనే వ్యక్తి ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషను పరిధి మారికవలసలో నివాసం ఉంటున్నాడు. అతడు ఆర్కే బీచ్లో పర్యాటకు కోసం గుర్రాలు తిప్పుతుంటాడు. అదే ప్రాంతానికి చెందిన రిక్క జగదీశ్వరరావు అలియాస్ శివ అనే యువకుడు కొన్ని సంవత్సరాలుగా సహాయకుడిగా పని చేస్తున్నాడు. గౌరీసాయి ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో గుర్రాల పర్యవేక్షణ, నగదు లావాదేవీలను గౌరీసాయి భార్య ఆధ్వర్యంలో జగదీశ్వరరావు చూసుకునేవాడు. ఈ క్రమంలో వారిద్దరికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈలోగా గౌరీసాయి జైలు నుంచి వచ్చాడు. ఎందుకో అతని అసిస్టెంట్ పై అనుమానం వచ్చింది. మార్చి 4న చినకొవ్వాడ సమీపంలోని రొయ్యల చెరువుల వద్దకు గౌరీసాయి, అతని స్నేహితులు, జగదీశ్వరరావుతో కలపి ఎనిమిది మంది ఆటోలో వచ్చారు. మద్యం, గంజాయి తీసుకున్న తర్వాత అంతా కలిసి బీచ్ ఒడ్డు ఉన్న సరుగుడు తోటలోకి వెళ్లారు. అక్కడ ఉన్న సర్వే రాయితో జగదీశ్వరరావు తలపై కొట్టి హత్య చేశారు. అప్పటికే తవ్వి సిద్ధం చేసుకున్న గొయ్యిలో జగదీశ్వరరావు మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. ఈ క్రమంలోనే తన కుమారుడు నెలరోజులుగా కనిపించడం లేదని జగదీశ్వర రావు తల్లి లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. గౌరీ సాయిని విచారించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. నిందితుడిని వెంట బెట్టుకుని ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్ సీఐ హెచ్. మల్లేశ్వరరావు, క్లూస్ టీం సహా పోలీసులు శనివారం చినకొవ్వాడ తీరానికి వచ్చి తహసీల్దారు ఎస్. కిరణ్ కుమార్ సమక్షంలో మృత దేహాన్ని వెలికి తీయించారు. శరీర భాగాలన్నీ కుళ్లిపోవడంతో పంచనామా అనంతరం వైద్యులను పిలిపించి అక్కడే పోస్టుమార్టం చేయించారు. హత్య కేసులో నిందితుడితో పాటు పది మంది పాత్ర ఉందని, వారిలో కొందరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సీఐ చెప్పారు.
అక్రమ సంబంధానికి వ్యక్తి బలి !
April 23, 2023
0
Tags