మోడీ అభీష్టం మేరకే అరెస్టులు

Telugu Lo Computer
0


మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరుగుతున్న మంచి పనులను అడ్డుకోవాలన్నదే మోదీ అభిమతమని ఆరోపించారు. ''దేశానికి కీర్తితెచ్చిన ఇద్దరు వ్యక్తులను ప్రధాని జైలుకు పంపారు. ఎక్సైజ్ పాలసీ కేవలం ఒక సాకు మాత్రమే, కుంభకోణం ఏమీ జరగలేదు. ఢిల్లీలో మంచి పనులను నిలిపివేయడమే మోడీ అభీష్టం. విద్యారంగంలో సిసోడియా, వైద్యరంగంలో సత్యేంద్ర జైన్ చేసిన మంచి పనులే వారి అరెస్టులకు కారణం'' అని కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియా బీజేపీలో ఇవాళ చేరితే ఆయన రేపటికి రిలీజ్ అయ్యేవారు కాదా? అన్ని కేసులు ఉపసంహరించుకునే వారు కాదా? సత్యేంద్ర జైన్ బీజేపీలో చేరితే ఆయనపై ఉన్న అన్ని కేసులు ఎత్తేసి, జైలు నుంచి రేపటికి రేపే రిలీజ్ చేసేవారు కాదా? అని ప్రశ్నించారు. అసలు విషయం అవినీతి కాదని, మంచి పనులు ఆపడం, సీబీఐ-ఈడీలను విపక్షాలపై ఉసకొలపడమేనని అన్నారు. ఢిల్లీలో అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు జరుగుతున్న అరెస్టులపై ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగించాలని ఆప్ నిర్ణయించినట్టు కేజ్రీవాల్ తెలిపారు. ''ప్రతి ఇంటికి వెళ్తాం. ప్రతి ఒక్కరితో మాట్లాడతాం. ఇందిరాగాంధీ ఒకప్పుడు ఎలా వ్యవహిరించారో మోదీ కూడా అలాగే వ్యవహరిస్తున్న వ్యవహారాన్ని ప్రజలకు వివరిస్తాం. ప్రజలే ఇందుకు సమాధానం చెబుతారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. చాలా కోపంగా కూడా ఉన్నారు'' అని కేజ్రీవాల్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)