కర్ణాటక రాష్ట్రంలో రాహుల్గాంధీ సారథ్యంలో భారత్ జోడో యాత్ర అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. మండ్య జిల్లాలోని గ్రామాల మీదుగా యాత్ర శుక్రవారం సాగిన సమయంలో ఉరకలేసిన ఉత్సాహంతో జనం పాల్గొన్నారు. యాత్ర సాగిన గ్రామాలు జనసంద్రాన్ని తలపించాయి. యాత్రలో భాగంగా రాహుల్గాంధీ విద్యా నిపుణులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. విద్యారంగంలో చోటు చేసుకున్న తాజా ఘటనలను రాహుల్ దృష్టికి తెచ్చారు. ప్రత్యేకించి విద్యారంగంలో చొరబడుతున్న కాషాయీకరణ ప్రమాదకరమైన సంకేతాలు ఇస్తోందని ఆవేదన చెందారు. హిజాబ్ అనంతరం కేంద్రం ఇచ్చిన 'బేటీ పడావో బేటీ బచావో' నినాదం అపహాస్యంగా మారిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని రాహుల్గాంధీ భరోసా ఇచ్చారు. మండ్య జిల్లా నాగమంగల తాలూకా కే మల్లేనహళ్లి గ్రామం నుంచి బేలూరు క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగింది. ఉదయం 7 గంటలకు సరిగ్గా యాత్రలో మల్లేనహళ్లిలో రాహుల్గాంధీ గ్రామీణులతో కొద్దిసేపు ముచ్చటించారు. మద్యాహ్నం 1 గంటకు పాదయాత్ర అంచే చిత్తనగహళ్లికి చేరుకుంది. యాత్రలో ప్రత్యేకించి యువత రాహుల్తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. అన్నివర్గాల ప్రజలు రాహుల్తో కలసి అడుగులు వేశారు. సాయంత్రం 4 గంటలకు అంచేచిత్తనగహళ్లి నుంచి బెల్లూరు క్రాస్ వరకు సాగింది. ఇక్కడి ఆదిచుంచనగిరి మఠానికి చెందిన స్టేడియంలో యాత్రికులు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం రాహుల్గాంధీ స్థానిక మఠాన్ని సందర్శించారు.
