యుద్ధనౌకలో పేలుడు : ముగ్గురు మృతి

Telugu Lo Computer
0


భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌకలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి ముగ్గురు నేవీ సిబ్బంది మృతి చెందగా మరో 11 మందికి గాయాలు అయ్యాయి. ముంబై నావల్ డాక్ యార్డులో ఉన్న ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌకలోని అంతర్గత కంపార్ట్మెంట్ లో ఈ పేలుడు సంభవించినట్లు నావికాదళ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల 45 నిముషాల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. పేలుడు సంభవించిన వెంటనే నౌకలోని మిగతా సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అధికారులు పేర్కొన్నారు. నౌకలోని ముఖ్యమైన భాగాలు సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐఎన్ఎస్ రణవీర్ విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ కేంద్రంగా సేవలు అందిస్తుంది. క్రాస్-కోస్ట్ కార్యాచరణలో భాగంగా 2021 నవంబర్ లో ఈ యుద్ధనౌకను ముంబై పోర్టుకు తరలించారు. త్వరలోనే ఇది విశాఖలోని బేస్ పోర్ట్‌కు తిరిగి రావాల్సి ఉండగా, ఇంతలోనే ఈప్రమాదం సంభవించింది. ప్రమాదంపై విశాఖలోని నౌకాదళ కమాండ్ విచారణకు ఆదేశించింది. ప్రాధమిక సమాచారం మేరకు.. నౌకలోని ఎయిర్ కండిషనింగ్ కంపార్ట్‌మెంట్‌లో గ్యాస్ లీకేజీ వల్ల పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఏసీ కంపార్ట్మెంటుకు ఆనుకుని ఉన్న గదిలో సిబ్బంది కూర్చుని ఉన్నారు. పేలుడు తీవ్రత అధికంగా ఉండడంతో ప్రాణ నష్టం వాటిల్లింది.

Post a Comment

0Comments

Post a Comment (0)