ఆంధ్రప్రదేశ్ లో సీజేఐ ఎన్వీ రమణ పర్యటన
December 24, 2021
0
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అమరావతిలో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు సీజేఐ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా - గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారు. సీజేఐ రాకతో ఆయన ఏపీ ప్రభుత్వం.. రాజ్ భవన్ లో వరుసగా రెండు రోజుల పాటు తేనేటి విందు ఏర్పాటు చేసారు. అమరావతిలోని నేలపాడు లో ఉన్న హైకోర్టును సీజేఐ సందర్శిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి జస్టిస్ ఎన్వీ రమణ స్వగ్రామానికి వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామస్థులు భారీగా ఏర్పాట్లు చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ నుంచి బయలుదేరి పొన్నవరం కు వచ్చే క్రమంలో ఆయనకు జిల్లా సరిహద్దు గరికపాడువద్ద కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్వాగతం పలికి సాదరంగా జిల్లాలోకి ఆహ్వానిస్తారు. హైదరాబాద్ జాతీయ రహదారిపై పెరికలపాడు క్రాస్రోడ్డు నుంచి 3 కి.మీ. దూరంలో ఉన్న పొన్నవరానికి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సొంతూరులో ఆయనకు పౌర సన్మానం జరగనున్నది. గ్రామంలో దాదాపు నాలుగు గంటలసేపు ఆయన గడపనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ కంచికచర్లలో పాఠశాల విద్యను అభ్యసించారు. పొన్నవరంలో ఆయన కుటుంబానికి పొలాలు ఉన్నాయి. ఆయన పెదనాన్న కుమారుడు నూతలపాటి వీరనారాయణ కుటుంబం ఇక్కడే నివాసం ఉంటోంది. శుక్రవారం సోదరుడి నివాసంలోనే భోజనం ఏర్పాట్లు చేశారు. ఇక, పొన్నవరం నుంచి ఈ రోజు మధ్యాహ్నం నుంచి గుంటూరు జిల్లా చందోలు గ్రామ ఆలయంలో పూజలు చేసిన అనంతరం పెదనందిపాడులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నివాసానికి వెళతారు. తిరిగి విజయవాడ చేరుకుంటారు. శనివారం ఉదయం కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. హోటల్లో సందర్శకులను కలుస్తారు. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న తేనేటి విందులో సీఎం జగన్ పాల్గొని రాష్ట్ర మంత్రులను సీజేఐ ఎన్వీ రమణతో పాటుగా ఇతర న్యాయమూర్తులకు పరిచయం చేస్తారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సీజేఐ హోదాలో ఎన్వీ రమణ సీఎం జగన్ ఒకే వేదిక మీదకు రావటం ఆసక్తి కరంగా మారుతోంది. సొంత రాష్ట్రానికి వస్తున్న సీజేఐ ఎన్వీ రమణకు భారీగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..ఆయనకు పొన్నవరం లో పాల్గొనే కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పేర్ని నాని..వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరు కానున్నారు. సీజేఐ కు రాష్ట్ర ప్రభుత్వం తేనేటి విందు ఇస్తుండటంతో ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్ క్రిస్మస్ వేడుకలు ముగిసిన వెంటనే శనివారం మధ్నాహ్నం నుంచి కడప నుంచి విజయవాడ చేరుకోనున్నారు. ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత సిద్ధార్థ అకాడమీలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే పౌర సన్మానం స్వీకరిస్తారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందుకు హాజరవుతారు. ఆదివారం నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే జ్యుడీషియల్ ఆఫీసర్ల కాన్ఫరెన్సులో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 460 మంది న్యాయాధికారులు పాల్గొంటారు. ఆ తరువాత హైకోర్టు ఆవరణలో హైకోర్టు బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్ల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీజేఐ తో పాటుగా న్యాయమూర్తులు హాజరు కానున్నారు. సీఎం జగన్ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక, మూడు రోజుల పర్యటనలో చివరగా.. గుంటుపల్లిలో బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత కంచికచర్ల చేరుకుని అక్కడి నుంచి రాత్రికి హైదరాబాద్ వెళతారు.
Tags