కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో కరోనా పరిస్ధితి దారుణంగా ఉందని ఓ మళయాళ న్యూస్ ఛానల్ చర్చలో పాల్గొన్న సందర్భంగా మహిళా నిర్మాత అయిషా సుల్తానా వ్యాఖ్యానించారు. అక్కడి అడ్మినిస్ట్రేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కేంద్రం లక్షద్వీప్ ప్రజలపై కోవిడ్ అనే జీవాయుధాన్ని ప్రయోగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో లక్షద్వీప్ బీజేపీ శాఖ అయిషా సుల్తానాపై స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కవరత్తి పోలీసులు ఏకంగా ఆమెపై రాజద్రోహం కేసు నమోదు చేశారు.
లక్షదీవుల్లోని ఛేట్లాట్ దీవికి చెందిన అయిషా సుల్తానాపై కవరత్తి పోలీసులు ఐపీసీ సెక్షన్ 124ఏ (రాజద్రోహం), 153బీ ( విద్వేష ప్రసంగం) కింద కేసులు పెట్టారు. ఏడాది క్రితం లక్షద్వీప్లో కరోనా కేసులే లేవని, అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా కరోనాపై పోరాటం చేశారని, కానీ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ బాధ్యతలు చేపట్టాక డిసెంబర్ నుంచి అక్కడ భారీగా కేసులు నమోదవుతున్నాయని అయిషా సుల్తానా వ్యాఖ్యానించారు. ప్రఫుల్ పటేల్ వచ్చాక ఇప్పటివరకూ 9 వేల కేసులు నమోదయయ్యాయని ఆరోపించారు. అయిషా సుల్తానాపై రాజద్రోహం కేసులు మోపడంపై స్ధానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసుల చర్యలపై జనం మండిపడుతున్నారు.
